కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఇచ్చే ప్యాకేజీలకు పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ అమ్ముడుపోయారు అంటూ వినిపిస్తున్న ఆరోపణలను ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కొట్టిపారేశారు. ఈ ఆరోపణల విషయంలో పవన్ కల్యాణ్‌కి అండగా నిలిచిన పోసాని కృష్ణమురళీ... అతడు డబ్బులు తీసుకున్నాడని అంటే తాను నమ్మనని అన్నారు. పదికి, రూపాయికి అమ్ముడుపోయే నటుడు పవన్ కల్యాణ్ కాదని పోసాని కృష్ణమురళి తేల్చిచెప్పారు. ఒకవేళ పవన్ మళ్లీ సినిమాలు చేస్తానని అంటే అతనికి బ్లాంక్ చెక్ ఇవ్వడానికి తాను రెడీగా వున్నానన్న పోసాని.. ఆ బ్లాంక్ చెక్కులో పవన్ ఎన్ని సున్నాలు పెట్టుకున్నా తనకు పర్వాలేదని స్పష్టం చేశారు. అవసరమైతే, 30, 40 కోట్లైనా ఇవ్వడానికి తాను సిద్ధం అని పోసాని ప్రకటించారు. 


పవన్ కల్యాణ్ అంటే కేవలం తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దేశంలోనూ అంత డిమాండ్ ఉన్న నాయకుడని పవర్ స్టార్‌కి కితాబు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌పై వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి ఈ వ్యాఖ్యలు చేశారు.