మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా బాక్సాఫీస్ రేసులో భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గిపోతున్న ఈ రోజుల్లో వ్యవసాయ రంగానికి ఉన్న అసలు ప్రాధాన్యతను తెలియజేస్తూ, అన్నదాతల కష్టాన్ని ఆడియెన్స్ ముందుంచిన ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు చాలామంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం మహర్షి సినిమాను అభినందించిన వారి జాబితాలో చేరారు. కుటుంబసభ్యులతో కలిసి మహర్షి సినిమాను వీక్షించిన వెంకయ్య నాయుడు ట్విటర్ ద్వారా సినిమా గురించి తన స్పందనను తెలియజేశారు. 'మహర్షి' చాలా బాగుందని చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి, చిత్ర నిర్మాతలు, ఇతర యూనిట్ సభ్యులను అభినందించారు.