న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నేడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరి హాలులో ఉదయం 11 గంటలకు జరగనున్న అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే అన్ని ముఖ్యమైన పార్టీలకు కేంద్రం సమాచారం అందించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో ఉగ్రవాదుల దాడి, దాడి అనంతరం కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రభుత్వంలోని పెద్దలు అఖిలపక్షానికి వివరించనున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే నేడు ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 


ఇదిలావుంటే, జమ్ముకాశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాదులు మళ్లీ ఏ క్షణమైనా దొంగ దెబ్బ తీయవచ్చనే ఇంటెలీజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు జమ్ముకాశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.