తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి ఆగ్రహం వ్యక్తంచేశారు. చెన్నైలో జరిగిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకావిష్కరణ సభకు హాజరైన రజినీకాంత్ మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ప్రస్తావించడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల కలయికను కృష్ణార్జునులతో పోల్చిన సంగతి తెలిసిందే. 


అయితే, రజినీకాంత్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన పేరెత్తకుండానే తమిళ సూపర్ స్టార్‌పై అసదుద్దీన్ ఓవైసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరూ కృష్ణార్జునులైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌరవులు ఎవరు, పాండవులు ఎవరో చెప్పాలని అన్నారు. అంతేకాకుండా మన దేశంలో మరో మహాభారత యుద్ధం చోటుచేసుకోవాలని తమిళ సూపర్ స్టార్ కోరుకుంటున్నారా అని అసదుద్దీన్ ఓవైసి నిలదీశారు.