ఒలింపిక్ పతక విజేత ..మన తెలుగు తేజం పీవీ సింధు‌కు మరో పురస్కారం దక్కనుంది. ఆమె పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషన్ అవార్డుకు సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ వెల్లడించింది.  2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు..ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ తన సత్తా చాటి రజత పతకాన్ని దక్కించుకుంది. తాజాగా సింధు కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే ఆమె సాధిస్తున్న విజయాలను గుర్తించి కేంద్రం..ఆమె పేరును పద్మభూషణ్ కు ప్రతిపాదించింది. పి.వి సింధు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీమిండియా కెప్టెన్ ధోనీ కూడా పద్మభూషణ్ రేసులో ఉన్నారు. ఈ పురస్కారానికి ధోనీ పేరును ప్రతిపాదిస్తూ బీసీసీఐ ఇటీవలే ఏకగ్రీవ తీర్మానం  చేసింది.