గువహటి: అస్సాం పర్యటనలో వున్న ప్రధాని నరేంద్ర మోదీకి వరుసగా రెండో రోజు నిరసనల సెగ ఎదురైంది. ఈశాన్య ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం గువహటికి చేరుకున్నారు. అస్సాం చేరుకున్న మోదీకి నల్ల జండాలు చూపిస్తూ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యు) సభ్యులు మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. గువహటిలోని లోకొప్రియ గోపినాథ్ బొర్దొలొయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి అస్సాం రాజ్ భవన్‌కి చేరుకునే క్రమంలో 'మోదీ గో బ్యాక్' అంటూ నిరసనల సెగ ఎదురైంది. సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్‌కి వ్యతిరేకంగా ఈ నిరసనలు పెల్లుబికాయి. 


శుక్రవారం సాయంత్రం 6:30కి గువహటి యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోది అనంతరం మహాత్మా గాంధీ రోడ్డులో వున్న ఏఏఎస్‌యు ప్రధాన కార్యాలయం పరిసరాల నుంచే వెళ్లే క్రమంలోనూ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు నల్ల జండాలతో ఆందోళన నిర్వహించినట్టు సమాచారం.