'ట్రిపుల్ తలాక్' అనేది సున్నితమైన అంశం. ఈ అంశాన్ని కేంద్రం తట్టడం అంటే తేనెతట్టును తట్టడమేనని కొన్ని ముస్లిం వర్గాల అభిప్రాయం. అయినా కూడా ఈ అంశంపై కేంద్రం స్టాండ్ గట్టిగానే ఉందని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో భాగంగానే ముస్లిం మహిళల చట్టం-1986లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. మూడుసార్లు తలాక్ అని చెప్పేవారికి మూడేళ్లు జైలు శిక్ష విధించాలని చట్టం చేయనుంది. ఈ చట్టాన్ని ఈ శీతాకాల సమావేశాలలోనే పార్లమెంట్‌లో చర్చకు పెట్టి ఆమోదముద్ర వేయించుకోవాలని యోచిస్తోంది. 


మూడుమార్లు తలాక్ అని చెప్పేవారికి మూడేళ్ల జైలు శిక్ష.. భారీగా జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ కూడా విధించే విధంగా ముసాయిదా చట్టాన్ని రూపొందించారు కేంద్ర న్యాయ, హోం శాఖ ఉన్నతాధికారులు. ఈ బిల్లు చట్టంగా మారితే ముస్లిం మహిళలకు రక్షణగా ఉంటుందని కేంద్రం వాదన. 


కేంద్రం శుక్రవారమే ముసాయిదా చట్టానికి సంబంధించిన కాపీలను అన్ని రాష్ట్రాలకు పంపి వారి అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరింది. రాష్ట్రాల నుండి అభిప్రాయాలు వచ్చాక, మంత్రుల బృందంతో చర్చించి తుది ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేస్తారు. తరువాత దానిని బిల్లు రూపంలో పార్లమెంట్లో చర్చకు పెట్టి ఆమోద ముద్ర వేయించుకొని రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి రాజముద్ర వేశాక ఆ బిల్లు చట్టం అవుతుంది. అయితే ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది.