రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నరుగా ఎంకే జైన్ నియమితులయ్యారు. గతంలో ఈయన ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఎంకే జైన్ పూర్తి పేరు మహేష్ కుమార్ జైన్. దాదాపు మూడేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. తన కెరీర్‌లో జైన్ ఐడీబీఐతో పాటు ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకుల్లో కూడా కీలక బాధ్యతలు వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్‌ ముంద్రా పదవీ కాలం ముగియడంతో ఆయన బాధ్యతలను ఎంకే జైన్ స్వీకరిస్తారు. ఈ మధ్యకాలంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు పోస్టు కోసం సంస్థ ఇంటర్వ్యూలను చేపట్టింది. అనేకమంది సీనియర్ బ్యాంకింగ్ అధికారులు ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎట్టకేలకు జైన్‌ను పదవి వరించింది. 


కామర్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన జైన్ సీఎఫ్‌ఏ, ఎంబీఏ, ఎఫ్‌ఆర్‌ఎం లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా కలిగియున్నారు. బ్యాంకింగ్ రంగంతో పాటు ఫైనాన్స్ రంగంలో కూడా అపార అనుభవం కలిగున్నారు. ప్రొఫెషనల్ బ్యాంకర్‌గా దాదాపు 30 సంవత్సరాల అనుభవం కలిగిన జైన్ కార్పొరేట్, రిటైల్ క్రెడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ మానిటరింగ్, బిజినెస్  ప్రాసెసింగ్ రీఇంజినీరింగ్, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లాంటి విభాగాల్లో కూడా పనిచేశారు.