Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. దీంతోపాటు.. ఇప్పటివరకు దేశంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య ఐదు కోట్లు దాటింది. గత 24 గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 8న ) దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కొత్తగా.. 89,706 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,115 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,70,129కి చేరగా.. మరణాల సంఖ్య 73,890కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,97,394 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 33,98,845 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 


దేశంలో ఐదు కోట్లు దాటిన కరోనా టెస్టులు.. 
ఇదిలాఉంటే.. మంగళవారం దేశవ్యాప్తంగా 11,54,549 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 8 వరకు మొత్తం 5,18,04,677 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే.. దేశంలో కరోనా రికవరీ రేటు 77.77 శాతం ఉండగా.. మరణాల రేటు 1.69శాతంగా ఉంది.