తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఫైరయ్యారు. ఇటీవల మరణించిన డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగిన విషయం తెలిసిందే. కరుణానిధి భౌతికకాయానికి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం రాజాజీ హాల్‌లో నివాళులర్పించారు. కానీ మెరీనా బీచ్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరుకాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం కరుణ సంస్మరణ సభలో స్టాలిన్‌తో కలిసి పాల్గొన్న రజినీకాంత్.. మాజీ సీఎం కరుణానిధి అంత్యక్రియల్లో పళనిస్వామి పాల్గొనకపోవడాన్ని తప్పుబట్టారు. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా దేశం మొత్తం హాజరైందని.. కానీ తమిళనాడు సీఎం పళనిస్వామి మాత్రం కనిపించలేదన్నారు. మీరేమైనా కలైంజర్‌ (కరుణానిధి), జయలలిత కంటే గొప్పవారా? అని రజినీకాంత్ ప్రశ్నించారు. కరుణ లేని తమిళనాడును ఊహించలేకపోతున్నానని రజినీ అన్నారు. ఎన్నో విజయాలను, అపజయాలను కరుణ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే నేతలు తమిళనాడుకు వస్తే కరుణను కలిసేవారని, ఇప్పుడు వాళ్లు ఎవర్ని కలుస్తారో అర్థం కావడం లేదని రజనీ అన్నారు.