న్యూ ఢిల్లీ : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన పశ్చిమ బంగాల్ (West Bengal ), ఒడిషా ( Odisha ) రాష్ట్రాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మొదట పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( Mamata Banerjee ), రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ ( Jagdeep Dhankhar ) ఎదురెళ్లి స్వాగతం పలికారు. వెస్ట్ బెంగాల్‌లో అంఫాన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని మోదీ.. రాష్ట్రాన్ని అన్నివిధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏరియల్ సర్వే ( Areal survey ) ద్వారా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ హెలీక్యాప్టర్ ద్వారా స్వయంగా వీక్షించారు. పర్యటన తర్వాత పశ్చిమ బెంగాల్‌కి రూ. 1000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ అక్కడి నుంచి నేరుగా ఒడిషా రాజధాని భువనేశ్వర్ బయల్దేరారు. 


ఒడిషా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ), ఒడిశా గవర్నర్ గణేషి లాల్ ( Ganeshi Lal ) స్వాగతం పలికారు. ఒడిషాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని మోదీ.. పూర్తిగా జలమయమైన ప్రాంతాలను ఏరియల్ వ్యూ ( Areal view ) ద్వారా వీక్షించారు. ఒడిశాలో తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు రూ 500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.