కర్నాటక: కర్నాటక ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దళిత నేత, గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేష్ మేవానిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల గంగావతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఈనెల 15న బెంగళూరు పర్యటన సందర్భంగా నిర్వహించే సభకు యువత భారీగా హాజరై గాల్లోకి కుర్చీలు విసిరేసి గందరగోళం సృష్టించాలని పిలుపునిచ్చారు.


ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చినప్పుడు 'ఆయనను నిలదీయండి..' అంటూ మేవాని ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని  భాజాపా నగర శాఖ అధ్యక్షుడు వీరేశ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో మేవానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారి కోరారు. శుక్రవారం నిర్వహించిన ఈ సభకు వచ్చిన ప్రజలకు హుసేనప్ప హంచనాళ డబ్బులు పంచుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తున్నాయని, ఈ చర్య ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమైనందున ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని వీరేశ్ కోరారు.