ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తప్పించుకుంటుండొచ్చు. ఎవరికీ దొరక్కుండా ఇవాళ దాక్కుంటుండొచ్చు. కానీ అంతిమంగా ఏదో ఒకనాడు నిజం ఏంటో బయటికి రాకుండా ఉండకపోదు. ఆరోజు ప్రజలే ఆయనకు బుద్ది చెబుతారు అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐ డైరెక్టర్‌కి వ్యతిరేకంగా వ్యవహరించారు. రఫేల్ డీల్‌పై దర్యాప్తు ప్రారంభమైతే అది ఎక్కడ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుందోననే భయంతోనే మోదీ ఈ పనిచేశారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 


సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను సెలవుపై పంపివ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి లోధి కాలనీ పోలీసు స్టేషన్‌కి తరలించిన సంగతి తెలిసిందే. అయితే, అరెస్ట్ అయిన కొద్దిసేపటి అనంతరం పోలీసు స్టేషన్ నుంచి విడుదలై వచ్చిన రాహుల్ గాంధీ బయట ఉన్న మీడియాతో మాట్లాడుతూ మోదీపై ఈ ఆరోపణలు చేశారు.