బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం వీరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినట్లు ఈ ఏడుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటించారు. అనంతరం శనివారం వీరు తమ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. జహీర్ అహ్మద్ ఖాన్, అఖండ శ్రీనివాస్‌ మూర్తి, చలువరాయ స్వామి, ఇక్బాల్ అన్సారీ, బాలకృష్ణ, రమేశ్ బండి సిద్దె గౌడ, భీమా నాయక్‌లు పార్టీకి రాజీనామా చేసినట్టు జేడీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్‌బాబు తెలిపారు.


2016 రాజ్యసభ ఎన్నికల్లో కూడా వీరంతా పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఈ ఏడుగురిని గతంలోనే జేడీఎస్ సస్పెండ్ చేసింది. తాజాగా శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా వీరంతా కాంగ్రెస్ అభ్యర్థి జీసీ చంద్రశేఖర్‌కు ఓటేశారు. జేడీఎస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో నలుగురు తమ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెప్పడంతో  వారి రాజీనామాలను ఆమోదించినట్టు స్పీకర్ కేబీ కోలివడ్ తెలిపారు. ఆదివారం తామంతా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు నాగమంగళ ఎమ్మెల్యే చలువరాయ స్వామి తెలిపారు.