కోహినీర్ వజ్రంతో పాటు భారత్ నుంచి తరలిపోయిన ప్రఖ్యాత పురాతన, విలువైన చారిత్రక సంపదను తిరిగి రప్పించేందుకు కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రధాని కార్యాలయాన్ని కేంద్రం సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. మీరు తీసుకున్న చర్యలు ఎంతవరకు ఫలించాయో కూడా చెప్పాలని కోరింది. అటు ఆర్టీఐకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పూర్తి వివరాలు ఇవ్వాలని పురాతత్వ శాఖ, సాంస్కృతిక శాఖలకు కేంద్ర సమాచార కమిషన్ సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్‌ వజ్రం, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ, నాసక్‌ వజ్రం, టిప్పు సుల్తాన్‌ ఖడ్గం, ఉంగరం, పులి బొమ్మ, మహారాజా రంజిత్‌సింగ్‌ బంగారు సింహాసనం, షాజహాన్‌ వినియోగించిన మరకత గ్లాసు, సరస్వతి విగ్రహం తదితరాలను భారత్‌కు తిరిగి తెప్పించేందుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద  సామాజిక కార్యకర్త బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ దరఖాస్తు చేసుకున్నారు. దీనిని భారత పురావస్తు శాఖకు బదిలీ చేయగా వారు.. విలువైన వస్తువులను తిరిగి తెప్పించే అంశం తమ పరిధిలోనిది కాదని బదులిచ్చారు.


అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించిన విలువైన వస్తువులను మాత్రమే తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తామని, బ్రిటిష్‌ కాలంలో తరలిపోయిన వస్తువులను తిరిగి తెచ్చే అధికారం తమకు లేదని చెప్పారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఐసీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు.. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న వారసత్వ సంపదను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.