కరెస్పాండెంట్ : రొనయ్ తివారి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భర్త చెవులను భార్య కత్తిరించిన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని నర్కెల్‌దంగాకు చెందిన మహ్మద్ తన్వీర్ (20)కి, ముంతాజ్‌తో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వయస్సులో తన్వీర్ కన్నా అతడి భార్య ముంతాజ్ 20 ఏళ్లు పెద్ద. తన్వీర్, అతడి కుటుంబసభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల నుంచే అక్కాచెల్లెళ్లతో కలిసి తన భర్త తన్వీర్‌ని ముప్పుతిప్పలు పెట్టడం ప్రారంభించిన ముంతాజ్.. మంగళవారం రాత్రి తుపాకీ చూపించి బెదిరిస్తూ ఏకంగా అతడి చెవులు కత్తిరించినట్టు తెలుస్తోంది. ముంతాజ్, ఆమె అక్కాచెల్లెళ్లు కలిసి తన చెవులు కత్తిరించారు అని తన్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


ముంతాజ్ పెట్టే వేధింపులు భరించలేని తన్వీర్ పలుమార్లు ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయినా.. ముంతాజ్ రౌడీల సహాయంతో అతడిని మళ్లీ పట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. తన కొడుకుని వదిలేయమని తానే స్వయంగా వెళ్లి ప్రాధేయపడినా ముంతాజ్ మనసు కరగలేదని తన్వీర్ తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. తన్వీర్ పేరిట ఉన్న ఇంటిని అమ్మేసి భారి మొత్తంలో సొమ్ము చేసుకున్నప్పటికీ అతడిని మాత్రం వదిలేయకుండా వేధింపులకు గురిచేస్తోందని తన్వీర్ తల్లి తెలిపారు. 


ప్రస్తుతం తన్వీర్ తన భార్య ముంతాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. తాను తన తల్లిని కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఇంటి నుంచి పారిపోయినా మళ్లీ పట్టుకొచ్చి కొడుతున్నారని తెలిపాడు తన్వీర్. తాను చనిపోయానని భావించిన తర్వాతే ముంతాజ్ తనని విడిచిపెట్టిందని, ఆ తర్వాతే ఎలాగోలా ఆమె చేతుల్లోంచి తప్పించుకుని బయటపడ్డానని తన్వీర్ చెప్పుకొచ్చాడు. 


అయితే, అసలు తాను ముంతాజ్‌ని ఎందుకు పెళ్లాడాల్సి వచ్చిందని అడిగితే తన్వీర్ వద్ద స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. తన్వీర్ చెవులు కత్తిరించిన ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహించిన అతడి బంధువులు, స్థానికులు మంగళవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇదిలాఉంటే, నిందితులు పరారీలో ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తు్న్నామని అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు.