ఐపీఎల్: బెట్టింగ్కు పాల్పడినట్లు అంగీకరించిన అర్బాజ్ ఖాన్
ఐపీఎల్లో బెట్టింగులకు పాల్పడినట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్(50) అంగీకరించారు.
ముంబాయి: ఐపీఎల్లో బెట్టింగులకు పాల్పడినట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్(50) అంగీకరించారు. ఐపీఎల్లో బెట్టింగులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై అర్భాజ్ ఖాన్ను పోలీసులు శనివారం విచారించారు. పోలీసుల విచారణలో అర్భాజ్ ఖాన్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండగా బెట్టింగులకు పాల్పడిన మాట వాస్తవమేనని అంగీకరించాడు.
అర్భాజ్ ఖాన్ శనివారం థానే పోలీసుల ముందు విచారణకు ఉదయం హాజరయ్యాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా.. అర్బాజ్ ఖాన్ ఐపీఎల్ లో రూ. 2.75 కోట్లు పోగొట్టుకున్నట్లు ఒప్పుకున్నాడు. థానే పోలీసు కమిషనర్, పరం బిర్ సింగ్ మాట్లాడుతూ, ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని, విచారణ ముగిసిన తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దాని గురించి క్లుప్తంగా తెలియజేస్తారని తెలిపారు.
ఈ విషయంపై ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, పోలీసులకు సంబంధించిన ఈ విషయంలో మేమీకీ జోక్యం చేసుకోలేము. భారతదేశంలో క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లకు అవినీతి విభాగాలు ఉన్నాయని.. పోలీసు వారితో సమన్వయం చేసుకోవచ్చని తెలిపారు.
శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పూణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అర్బాజ్ ఖాన్కి కేసు విచారణకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సోను జలాన్ అనే బుకీని అరెస్ట్ చేసిన పూణె నేర విభాగం పోలీసులు అతడు వెల్లడించిన సమాచారం మేరకే అర్బాజ్ ఖాన్కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
అనేక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో సోనూ జలాన్ ఫిక్సింగ్కి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోలూ జలాన్కి డి-కంపెనీ బాస్ దావూద్ ఇబ్రహీంతోపాటు అతడితో సత్సంబంధాలు కలిగిన మరో ఇద్దరు ఉగ్రవాదులతోనూ సంబంధాలున్నట్టు తెలుస్తోంది. 2018 ఐపీఎల్లో బెట్టింగుల ద్వారా దాదాపు రూ.500 కోట్లు వెనకేసిన జలాన్.. ఆ మొత్తాన్ని హవాలా మార్గాల్లో ముంబై నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి కరాచికి తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.