చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు చెలరేగి ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెయిర్‌స్టో(106; 99బంతుల్లో 15×4, 1×6) శతకంతో చెలరేగిపోగా.. మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్ ‌(60; 61బంతుల్లో 8×4) అర్ధశతకంతో స్కోర్ పెరగడంలో మరో కీలక పాత్ర పోషించాడు. 


అనంతరం 306 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు 45 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో న్యూజిలాండ్‌కి 119 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఏదైతేనేం.. సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించి సెమీ-ఫైనల్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంది.