గువహటి : ఇండియా -శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. పిచ్‌తో పాటు అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్‌ తర్వాత భారీ వర్షం పడటంతో అంతరాయం ఏర్పడింది.  కాగా, వర్షం కురిసిన  తర్వాత మ్యాచ్‌ను కొనసాగించడానికి ప్రయత్నం చేసినా ఫలించలేదు. నిరంతరాయంగా వర్షం పడుతుండటంతో పిచ్ తడిసి చిత్తడయ్యింది.  
 


పిచ్ ను సాధారణ పరిస్థితి తీసుకురావడానికి గ్రౌండ్ మెన్ ఎంత ప్రయత్నం చేసిన ఫలించలేదు. కనీసం షార్ట్ ఓవర్ మ్యాచ్‌ జరిపించాలని ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. సత్వరమే సిద్ధం చేసే ప్రయత్నం అసోం క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) చేసినప్పటికీ, ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో  రాత్రి గం.10.00లకు  మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్ మొదటగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆరంభ దశలో కాసేపటికి భారీ వర్షం పడి మ్యాచ్‌కు ఆటంకం కల్గించింది. రెండో టీ20 ఇండోర్‌ వేదికగా మంగళవారం జరుగనుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..