మణికట్టుతో మాయ చేసే టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాను ప్రపంచ వేదికలపై విజయం సాధించడానికి వెనుకున్న సీక్రెట్ ఏంటో వెల్లడించాడు. భారత జట్టు కెప్టేన్ విరాట్ కోహ్లీ తనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడం వల్లే తాను ప్రపంచ వేదికలపై విజయం సాధించగలిగాను అని కుల్దీప్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లకు సరైన అవకాశం లభించకపోతే వారిలోని నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం కూడా లభించదని చెబుతూ తనకు కోహ్లీ కూడా అలాగే అవకాశాలు ఇచ్చి తన విజయానికి కారణమయ్యాడని అన్నాడు. 


ఈ ఏడాది ఐపిఎల్ టోర్నమెంట్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడిన కుల్దీప్ యాదవ్.. ఈడెన్ గార్డెన్స్‌లోని బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌పై అంతగా మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐపిఎల్‌లో విఫలమైన సంగతిని పక్కనపెట్టి మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌పైనే దృష్టి సారిస్తానని స్పష్టంచేశాడు. అంతేకాకుండా ఐపిఎల్‌కి ప్రపంచ కప్‌కి మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెబుతూ ఐపిఎల్‌లో మెరిసిన ఆటగాళ్లంతా తమ దేశం తరపున ఆడి దేశాన్ని గెలిపించలేకపోయారని చెప్పుకొచ్చాడు.