ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు మాజీ కెప్టేన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనిని పక్కకుపెట్టడంతో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా ఆ రెండు మ్యాచ్‌ల్లో అవకాశం లభించింది. కానీ రిషబ్ పంత్ మాత్రం తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 52 పరుగులే చేయడం రిషబ్ పంత్ ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని రిషబ్ పంత్‌కి ఇచ్చేంత ప్రతిభ అతడి వద్ద వుందా అనే సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరి మధ్య వున్న వ్యత్యాసాలను పోల్చుతూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ సెలెక్టర్లను ఏకిపారేశారు. 


తనపై వస్తున్న విమర్శలపై శనివారం రిషబ్ పంత్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ క్రికెట్‌లో లెజెండ్ అయిన ధోనితో తనను పోల్చడం సరికాదని అన్నాడు. క్రికెట్ ప్రియులు తనను ధోనితో పోలుస్తూ విమర్శించడం తగదని చెబుతూనే... విమర్శకులను తాను నిరోధించలేను కదా అని రిషబ్ పేర్కొన్నాడు. ధోని, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ల నుంచి తాను ఎప్పటికప్పుడు ఎంతో నేర్చుకుంటున్నానని, తన ఆటను మరింత మెరుగు పర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని రిషబ్ చెప్పుకొచ్చాడు.