ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తలపడే తొలి మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా తరఫున ఆడాలన్న తన కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదని టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ పేర్కొన్నాడు. 'నా జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందుతున్నాను. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నా శక్తి మేరకు రాణించడానికి ప్రయత్నిస్తాను. నాకు అమూల్యమైన సలహాలు ఇస్తూ.. నా వ్యక్తిత్వాన్ని మార్చినందుకు టీమిండియా-ఏ కోచ్ రాహుల్ ద్రావిడ్ సర్‌కు రుణపడి ఉంటాను' అని పేర్కొన్నాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకు ముందు.. యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌పంత్‌పై టీమిండియా అండర్‌-19, భారత్‌-ఏ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పంత్‌ వైవిధ్యంగా బ్యాటింగ్‌ చేయగల సత్తా, నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడారు. 'పంత్‌ దూకుడైన బ్యాట్స్‌మన్‌. అతడు జాతీయ జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషం. పంత్‌ మరెంతో పరిణతి సాధించి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను' అని ద్రవిడ్‌ అన్నారు.


సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడటంతో సెలక్టర్లు 20 ఏళ్ల రిషబ్ పంత్ టీమిండియాకు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ పర్యటనలో దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు... కార్తీక్‌కు గాయమైనా లేక ఏదైనా కారణం చేత మ్యాచ్‌లకు దూరమైతే, టెస్టుల్లోకి రిషబ్ పంత్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.


ఇంగ్లండ్‌‌తో జరుగనున్న టెస్ట్‌ సిరీస్‌‌కు ఎంపికైన భారత జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కరుణ్‌ నాయర్‌, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), రిషబ్‌ పంత్(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దిప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్