సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసు మేలో నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టుల్లో 1,373 మంది పట్టుబడ్డారు. వీరిలో 320 మందికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 250 మందికి 1-5 రోజుల జైలు శిక్ష, 70 మందికి 6-13రోజుల జైలు శిక్ష విధించామన్నారు. అంతేకాకుండా పట్టుబడ్డ మందుబాబుల నుంచి రూ.7.84 లక్షలు జరిమానాగా వసూలు చేశామన్నారు.


శంషాబాద్‌లో అత్యధికంగా 257 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మియాపూర్ పరిధిలో అతిగా మద్యం తాగి ప్రమాదకరంగా వాహనాలు నడిపిన 23 మందికి 6 నుంచి 13 రోజుల జైలు శిక్ష పడింది. పట్టుబడ్డ మందుబాబులను రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, మేడ్చల్ జిల్లా కోర్టుల్లో హాజరుపరిచారు. వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణలో భాగస్వాములై స్వీయ నియంత్రణ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం శివకుమార్ కోరారు.