హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతూ.. తాము సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసన తెలిపామని, త్వరలో భావసారూప్యత గల ముఖ్యమంత్రులతో సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలనుండి సీఏఏపై తీవ్రమైన నిరసనలు వ్యక్తం అయిన పరిస్థితుల్లో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా సీఏఏ కు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని కేసిఆర్ తెలిపారు. 



మరోవైపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. టీఆర్ఎస్ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంత ఏకపక్షంగా ఫలితాలు నా అనుభవంలో ఇలాంటి ఫలితాలు చూడలేదని ఆయన పేర్కొన్నారు. 


సాదారణంగా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఫలితాలు రావని.. కానీ, కేటీఆర్ తో సహా ఇతర నేతలంతా ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. గెలిచినంత మాత్రాన గర్వం, అహంకారం రావొద్దన్నారు. గెలిచిన అభ్యర్థులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. ఇంత ఘన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు సదా కృతజ్ఞులమై ఉంటామని, మీకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా చేపడుతామని తెలిపారు. 31, మార్చి నుంచి 57 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వృద్ధాప్యం పెన్షన్ ఇస్తామని.. అలాగే, ఉద్యోగుల వయోపరిమితిని త్వరలోనే పెంచుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..