మెట్‌పల్లి: ఓటు హక్కు వినియోగించుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించి తాను వేసిన ఓటును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. శనివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్ సాగర్ అనే యువకుడు.. అదే సమయంలో రహస్యంగా ఫోటో తీసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎన్నికల నియామవళికి విరుద్ధంగా వ్యవహరించిన సాగర్ పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారి ఫిర్యాదుతో సాగర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆత్మకూర్ ఎస్సై శంకర్ రావు తెలిపారు. 


ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలు తీసుకున్న ఘటనలో ఒకరిద్దరిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.