హైదరాబాద్‌లోని చందానగర్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. చందానగర్‌లోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. చందానగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అపర్ణ అనే యువతి తన తల్లి విజయ లక్ష్మి, తన నాలుగేళ్ల కూతురు కార్తికతో కలిసి చందానగర్‌లో అద్దెకి వుంటోంది. గత రెండు రోజులుగా ఇంటికి బయటి నుంచే తాళం వేసి వుండటంతో ఇంటి యజమాని అపర్ణ మొబైల్ ఫోన్‌కి ఫోన్ చేయగా ఆ ఫోన్ తాళం వేసి వున్న ఇంట్లో నుంచే రింగ్ అవుతున్నట్టు వినిపించింది. దీనికితోడు ఇంట్లోంచి కుళ్లిన దుర్వాసన కూడా వస్తుండటంతో ఇంటి యజమాని పోలీసులకి సమాచారం అందించారు. 


ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి శవమై కనిపించారు. విజయలక్ష్మి, కార్తిక శవాలు ఓ గదిలో బెడ్‌పై కనిపించగా.. వంట గదిలో రక్తపు మడుగులో అపర్ణ శవమై కనిపించింది. విజయలక్ష్మి, కార్తిక విష ప్రయోగం కారణంగా మృతి చెంది వుంటారని అనుమానిస్తున్న పోలీసులు.. ప్రస్తుతం అపర్ణతో వేరుగా వుంటున్న ఆమె భర్త మధు ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు.