హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా పోలీసులు అధికారులు, సినీ తారల మధ్య ఆదివారం క్రికెట్ మ్యాచ్ జరగనుంది. పోలీసులు, ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచేందుకు హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ పోలీస్ క్రికెట్ లీగ్(హెచ్‌పీ‌ఎల్)పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫైనల్ మ్యాచ్ విజేత జట్టుతో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్ యువ కథానాయకులు అఖిల్, విజయ్ దేవరకొండ, నితిన్, నాని తదితరులు ఆడతారని.. వీరితో పోలీసు క్రికెట్‌ జట్టు తలపడనుందని  హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఈ పోటీ జరుగుతుందని, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌‌లోని ఎల్బీ స్టేడియంలో 5.30 గంటల నుంచి మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. ఈ మ్యాచ్‌కు నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ప్రవేశం ఉచితమని అంజనీ కుమార్ అన్నారు.


ప్రజలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడాలన్న లక్ష్యంతో రెండు నెలల క్రితం హెచ్‌పీ‌ఎల్ పేరుతో క్రికెట్ పోటీలను ప్రారంభించినట్లు.. జోన్ల వారీగా పోటీలు నిర్వహించగా.. ఉత్తర, పశ్చిమ మండల జట్లు ఫైనల్‌కు చేరుకున్నట్లు చెప్పారు. ఈ మ్యాచ్‌ సందర్భంగా సాంస్కృతిక శాఖ నుంచి కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమానికి హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.