Jagtial Collector Yasmeen Basha: పరమత సహనం పాటించండి, సర్వ మతాలు ఒకటేనని భావించండి. మత విద్వేషాలకు దూరంగా ఉండండి అన్న హితోక్తులు చెప్పే వారు వేలల్లో ఉంటారు. ఇతర మతాలను గౌరవిస్తూ జీవనం సాగించాలని ఢంకా బజాయించి చెప్పే వారు ఆచరణలో పెట్టే విధానం చాలా తక్కువగా ఉంటుంది. బయటకు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా తమ అభిప్రాయాలను వ్యక్త పరిచేవారూ లేకపోలేదు. అయితే ఈ అధికారిణి మాత్రం మాటల్లో చెప్పలేదు… ఆదర్శాలు వల్లె వేయలేదు. తనలోని సర్వమత సౌభ్రాతృత్వం ఏంటో తన చేతల్లోనే చూపించారు. అందరి దేవుళ్లను ప్రార్థించే తత్వంతో ముందుకు సాగాలని ఆచరించి మరీ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ధర్మపురి నర్సన్న సాక్షిగా ఆమెలోని గొప్పతనం చూసిన ప్రతి ఒక్కరూ హాట్సాప్ చెప్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన యాస్మీన్ భాషా ఐఏఎస్ అధికారిణిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ప్రత్యేక అనుభందం పెనవేసుకున్న ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదనపు కలెక్టర్‌గా కూడా పనిచేశారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహించే ఏర్పాట్ల విషయంలో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అప్పుడు కూడా ఆలయ అధికారులు దేవాదాయ శాఖ సాంప్రాదాయం ప్రకారం కలెక్టర్ యాస్మీన్ భాషకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరపడంతో పాటు స్వామి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకుని ఆదర్శప్రాయంగా నిలిచారు. 


గతంలో ఇతర మతాలకు చెందిన అధికారులు అయితే ఆలయంలో ఏర్పాట్ల గురించి విధులు నిర్వర్తించినా.. గర్భాలయంలోకి మాత్రం వెళ్లేందుకు సాహసించేవారు కాదు. ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సి వచ్చినప్పటికీ.. బొట్టు, పూజ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటారు. కానీ జగిత్యాల కలెక్టర్ మాత్రం వీరందరికి భిన్నంగా వ్యవహరించి ఐఏఎస్ అధికారి హోదాలో సర్వమత సమగ్రతను చాటుకున్నారు. తాజాగా శనివారం ధర్మపురి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి జిల్లా కలెక్టర్ హోదాలో అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ యాస్మిన్ భాషా అర్చకుల సూచనలను అనుసరించి హిందూ ధర్మం ప్రకారం నుదుటన తిలకం పెట్టుకుని, తలపాగ చుట్టుకుని గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను ధర్మపురి నరసన్నకు సమర్పించారు. అలాగే స్వామి వారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన ఆమె తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. వేద పండితుల మంత్రోఛ్ఛారణల మధ్య యాస్మిన్ భాష కలెక్టర్‌గా తాను నిర్వహించాల్సిన తంతును నిర్వహించి దేశంలోనే అత్యంత అరుదైన అధికారిణిగా గుర్తింపు పొందారని చెప్పవచ్చు. 


ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు అంజన్న సన్నిధిలో పర్యటించిన సందర్భంలో సీఎం వెంట వచ్చిన జగిత్యాల కలెక్టర్ హోదాలో యాస్మీన్ భాషా కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అంజన్న బొట్టు కూడా తన కంఠంపై పెట్టుకుని మరీ ఆలయ అభివృద్దిపై జరిగిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు.


హ్యాట్సాఫ్ కలెక్టరమ్మ…
జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మీన్ భాషా వ్యవహరించిన తీరుపై భక్త జన సందోహం అంతా కూడా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇతర మతాల దేవుళ్లను పూజించడంతో పాటు అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కొనసాగించిన తీరును గమనించిన భక్తులు.. కలెక్టరమ్మ మీరు గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ఇది కదా సర్వమత సమానత్వం అంటే. అందరి దేవుళ్లూ ఒకటేనని భావించడం అంటే ఇది కదా అని భక్తులు కలెక్టర్ యాస్మిన్ భాషాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.


ఇది కూడా చదవండి : Bandi Sanjay Slams KCR: తగ్గేదెలే.. బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడతా


ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook