పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తనపై కోడి గుడ్లతో దాడికి పాల్పడ్డారంటూ హైదారాబాద్‌లోని మాదాపూర్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నారు ప్రముఖ సినీ రివ్యూ రైటర్ కత్తి మహేష్. గురువారం రాత్రి కొండాపూర్‌లోని ఓ టీవీ ఛానెల్‌కి కారులో వెళ్తున్న కత్తి మహేష్‌పై మార్గం మధ్యలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడిచేసి వెళ్లారు. ఇదే విషయమై కత్తి మహేష్ శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులే తనపై కుట్ర పెంచుకుని దాడి చేశారని కత్తి మహేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


కత్తి మహేష్ ఫిర్యాదుపై స్పందించిన మాదాపూర్ పోలీసులు.. గుర్తుతెలియని వ్యక్తులపై 323, 506 సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కత్తి మహేష్ పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అనంతరం కత్తి మహేష్, అతడిపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు, జనసేన కార్యకర్తలు ఓ అవగాహనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి మాదాపూర్ పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన కత్తి మహేష్.. "కేవలం అవగాహనారాహిత్యం, మితిమీరిన అభిమానంతోనే వాళ్లు తనపై దాడి చేశారే తప్ప ఇందులో వాళ్ల తప్పేం లేదని అనిపించిందని, అందువల్లే వారిపై ఇచ్చిన ఫిర్యాదుని ఉపసంహరించుకున్నాను" అని అన్నారు కత్తి మహేష్.