భారత ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ కవల పిల్లలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మోదీ సూచనలతోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని.. వారిద్దరూ చేసే అరాచకాలను మాత్రం ప్రజలు కచ్చితంగా గమనించి తగిన శిక్ష వేస్తారని ఆయన జోస్యం చెప్పారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కూడా ఓ పెద్ద కథ అని.. దానిని ఫ్రంట్ అనేదానికంటే స్టంట్ అంటే బాగుంటుందని తెలపారు.


ఒకవేళ ఆయన అలాంటి ఫ్రంట్ ఏదైనా పెడితే.. అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసే ప్రయత్నమే తప్ప.. తెలంగాణకి ఒరిగేది ఏమీ లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఆ తర్వాత నోటుకి ఓటు కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం అందరికీ విదితమే.