హైదరాబాద్: ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెసిడెన్షియల్ స్కూల్స్‌, పంచాయతీ కార్యదర్శి కొలువులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆగస్టు 1న గ్రామ సర్పంచ్‌ల, వార్డు మెంబర్ల పదవి కాలం ముగిస్తుండటంతో.. గ్రామాలలో నియమించే స్పెషల్‌ ఆఫీసర్ల నియమాకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రివర్గ సమావేశం ఈ క్రింది అంశాలకు ఆమోదం తెలిపింది:


• ఆగస్టు 15 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు ప్రారంభించాలి


• మందుపాతర పేలుడులో మరణించిన మాజీ మంత్రి మాధవరెడ్డి కుటుంబానికి హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయింపు.


• భారత్-పాక్ సరిహద్దులో జరిగిన పోరాటంలో మరణించిన జవాను ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి షేక్ పేటలో 200 గజాల కేటాయింపు


• రాష్ట్రంలో బీసీ జనాభా గణన వెంటనే ప్రారంభించాలి


• ప్రస్తుతమున్న బిసి రెసిడెన్షియల్స్‌కు తోడుగా 2019-20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కొత్త బిసి రెసిడెన్షియల్స్ ఏర్పాటు. ఈ రెసిడెన్షియల్స్‌లో 4,284 మంది సిబ్బంది నియామకం


• రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి నియామకం


• పదవీ కాలం ముగుస్తున్న సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకం. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేకాధికారుల నియామకం


• ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకం కాబట్టి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు వంద రూపాయలకు గజం చొప్పున, జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు. ఆ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే టిఆర్ఎస్ పార్టీకి 29 జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు


• గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా 4 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం


• ప్రతీ నియోజకవర్గానికి కచ్చితంగా ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే విధానం మేరకు, రాష్ట్రంలో కొత్తగా 18 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు


• రాష్ట్ర పోలీస్ శాఖ కోసం కొత్తగా 11,577 వాహనాల కొనుగోలు


• సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సిబ్బంది నియామకం


• జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే అవకాశాల పరిశీలన


గురుకులాల్లో 281 పోస్టులు..


గురుకుల జూనియర్ కాలేజీల్లో 281 జూ. లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. ఇందులో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 149, గిరిజన గురుకులాల్లో 40, మైనార్టీ గురుకులాల్లో 89, సాధారణ గురుకులాల్లో 3 పోస్టులు ఉన్నాయి. ఈనెల 31న ఇందుకు నోటిఫికేషన్ జారీ కానుండగా.. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.