హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన ఆ పార్టీ ఎమ్మెల్సీ కే యాదవ రెడ్డి.. పార్టీ సస్పెండ్ చేసినట్టుగా ఇంకా ఎటువంటి లేఖ తనకు అందలేదని అన్నారు. శుక్రవారం యాదవ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... తన నుంచి ఏమాత్రం వివరణ కూడా తీసుకోకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఏకపక్షం నిర్ణయం తీసుకోవడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతాలు లేవని యాదవ రెడ్డి ఆరోపించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడలేదని, ఒకవేళ అదే నిజమని పార్టీ భావిస్తే, దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని యాదవ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. 


ఇవాళ సాయంత్రం మేడ్చల్‌లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు యాదవ రెడ్డి బదులిస్తూ.. పార్టీ మార్పుపై త్వరలోనే స్పందిస్తానని స్పష్టంచేశారు.