2020 Nobel Prize in Chemistry: న్యూఢిల్లీ: రసాయన శాస్త్రంలో 2020 నోబెల్ పురస్కారం ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించింది. జీనోమ్ ఎడిటింగ్ (genome editing) విధానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు.. రసాయన శాస్త్రం (Chemistry) లో విశేష సేవలందించిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఎమ్మాన్యుల్లే చార్పెంటియర్ (Emmanuelle Charpentier ), జెనిఫర్ ఏ డౌడ్నా (Jennifer A Doudna) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు. జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎమ్మాన్యుల్లే చార్పెంటియర్, జెనిఫర్ ఏ డౌడ్నా 2020 నోబెల్ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (The Royal Swedish Academy of Sciences) బుధవారం ప్రకటించింది. జన్యువు టెక్నాలజీకి సంబంధించి అత్యంత పదునైన సాధనాన్ని శాస్త్రవేత్తలు ఎమ్మాన్యుయెల్లె చార్పెంటీయర్, జెనిఫర్ ఏ డౌడ్నా కనుగొన్నట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. సీఆర్ఐఎస్‌పీఆర్/సీఏఎస్9 (CRISPR/Cas9) జెనెటిక్ సిజర్స్‌ను వీరు అభివృద్ధి చేశారని.. దీనిని ఉపయోగించి డీఎన్ఏను మార్చవచ్చునని అకాడమీ వెల్లడించింది. జంతువులు, మొక్కలు, సూక్ష్మ జీవుల డీఎన్ఏను ఈ విధానాన్ని ఉపయోగించి మార్చవచ్చునని తెలిపింది. ఈ పరిశోధన కొత్త కేన్సర్ థెరపీలకు ఉపయోగపడుతుందని పేర్కొంది. 



ఇదిలాఉంటే.. ఫ్రాన్స్‌‌కు చెందిన ప్రొఫెసర్ ఎమ్మాన్యువ‌ల్ ప్రస్తుతం జర్మనీలోని బెర్లి మ్యాక్స్ ప్లాంక్ యునిట్‌లో డైర‌క్ట‌ర్‌గా పని చేస్తున్నారు. మ‌రో శాస్త్ర‌వేత్త జెన్నిఫ‌ర్ అమెరికా బెర్క్‌లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రోఫెస‌ర్‌గా సేవలందిస్తున్నారు. అయితే వారిద్దరికీ 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు చెల్లించనున్నట్లు స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు, వైద్య రంగంలో ముగ్గురుకు నోబెల్‌ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. Also read: Nobel Prize 2020: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్