వాషింగ్టన్‌: అమెరికాలోని కాన్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 1.30 సమయంలో టెకిలా కెసి బార్‌లోకి ప్రవేశించిన  గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగుల కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు కాన్సాస్ పోలీసులు తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన వార్తా కథనం ప్రకారం.. కాన్సాస్ బార్‌లో దుండగుల కాల్పులకు భయాందోళనలకు గురైన బార్‌ కస్టమర్స్ బయటికొచ్చి వీధుల గుండా పరుగులెత్తి ప్రాణాలు దక్కించుకున్నారని తెలుస్తోంది.


సీసీటీవి దృశ్యాల ఆధారంగా ఈ దాడికి పాల్పడిన ఇద్దరు దుండగుల ఫోటోలను విడుదల చేసిన కాన్సాస్ సిటీ పోలీసులు.. దుండగులను గుర్తించిన వారు సమాచారం ఇచ్చి విచారణకు సహకరించాల్సిందిగా పౌరులకు విజ్ఞప్తి చేశారు. దాడి జరగడానికన్నా ముందుగా బార్‌లో ఓ ఘర్షణ జరిగిందని తెలుసుకున్న పోలీసులు.. ఆ ఘర్షణ కారణంగా బార్‌లోంచి బయటికి వెళ్లిపోయిన వారే మళ్లీ ఆయుధాలతో తిరిగొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.