'వైట్ హౌస్ ముందు సాయుధుడు వెంట తెచ్చుకున్న తుపాకీతో తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు' అని ఆదివారం అధికారులు వెల్లడించారు. సీక్రెట్ సర్వీస్, మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్టుమెంటులు ఆ ఆగంతకుడిని గుర్తించారు. కానీ భద్రతా కారణాల వల్ల అతని పేరు వెల్లడించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైట్ హౌస్ వర్గాల కథనం ప్రకారం.. ఓ సాయుధుడు శనివారం ఉదయం గం.11.46నిమి.లకు వైట్ హౌస్ వద్దకు చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న తుపాకీతో పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనలో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది ఆగంతకుడిని పట్టుకునేందుకు చూడగా, తుపాకీతో తనని తను కాల్పుకుని బలవన్మరణం పొందాడు.


కాగా, ఆ సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మిలానియా ట్రంప్‌ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ లో ఉన్నారు. ఫ్లోరిడా పర్యటనను ముగించుకొని ట్రంప్ దంపతులిద్దరూ వాషింగ్టన్‌లో అదేరోజు సాయంత్రం ఓ డిన్నర్‌ ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉంది. కాల్పులు జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, స్థానిక పోలీసులు.. సీక్రెట్ సర్వీస్, ఇతర ఏజెన్సీల మద్దతుతో కాల్పుల కేసును దర్యాప్తు చేస్తున్నారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.