పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. నటిగా, నేపథ్యగాయని పేరు ప్రఖ్యాత్యలు సంపాదించుకున్న రేష్మ దారుణ హత్యకు గురైంది. రేష్మను ఆమె భర్తే కాల్చిచంపినట్టు తెలుస్తోంది. ఖైబర్ పక్తుంక్వాలోని నౌషెరా కలాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కి చెందిన జియో టీవీ ప్రసారం చేసిన ఓ వార్తా కథనం ప్రకారం.. రేష్మను నిందితుడు నాలుగో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. రేష్మ హకిమాబాద్‌లో ఉంటున్న తన సోదరుడితో కలిసి ఉంటోంది. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయని, అవి మనసులో పెట్టుకునే నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి కాల్చిచంపిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్టుగా అక్కడి స్థానిక పోలీసులు తెలిపారు. రేష్మ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


పాస్తో బాషలో పాటలు పాడిన గాయనిగా రేష్మకు పాక్‌లో మంచి గుర్తింపు ఉంది. 'జొబల్ గొలునా' అనే ప్రముఖ పాకిస్తాని నాటికలోనూ ఆమె నటించారు. ఈ ఏడాదిలో ఖైబర్ పక్తుంక్వాలో ఈ తరహాలో మహిళా కళాకారులు హత్యకు గురవ్వడం ఇది 15వసారి.