ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో జరిగిన దాడి బహుళ సంస్కృతిపై జరిగిన దాడి అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జలాలాబాద్‌లో హిందువులు, సిక్కులపై దాడిని మోదీ తీవ్రంగా ఖండించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌ పట్ణణంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారు. మృతుల్లో 11 మంది సిక్కులు, హిందువులు ఉన్నారు. ఈ ఉగ్రదాడిలో మరో 20 మంది గాయపడ్డారు. ఆఫ్గనిస్తాన్‌లో రానున్న పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేయబోతున్న ఒక సిక్కు రాజకీయనేత కూడా ఈ ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో ఉన్నారు.


నాన్‌ఘర్హర్‌ ప్రావిన్సు గవర్నర్‌ కార్యాలయానికి సమీపంలోని మార్కెట్‌లో దుండగుడు తనని తాను పేల్చేసుకున్నాడు. ఆ సమయంలో గవర్నర్‌ కార్యాలయంలో అధ్యక్షుడు అష్రాఫ్‌ గనీ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దేశంలో మైనారిటీ వర్గాలైన సిక్కులు, హిందువులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.


బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: సుష్మా స్వరాజ్


ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చెప్పారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జెఎన్‌ భవన్‌లో బాధితుల బంధువులను కలుస్తానని ఆమె అన్నారు.