తక్కువ ధరకు ఆహారాన్ని అందించే ఉద్దేశంతో గతంలో ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లను ఇటీవల మూసివేయడంపై స్పందించిన ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. అన్న క్యాంటీన్ల నిర్వహణలో లోపాలను సవరించి, ప్రజలకు మరింత ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న మంత్రి.. త్వరలోనే మార్పుచేర్పులతో క్యాంటీన్లను ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. 


ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంతో ప్రారంభించిన అన్న క్యాంటీన్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించకుండానే క్యాంటీన్ల ప్రారంభోత్సవం పేరుతో ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. స్పష్టమైన ప్రణాళిక లేకుండా ప్రారంభించిన అన్న క్యాంటీన్లతో అర్హులకు అందాల్సిన ప్రయోజనం అందడం లేదని మంత్రి ఆరోపించారు. కొత్త పాలసీని రూపొందించిన అనంతరం ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆవశ్యకత ఉందన్న అంశాలని పరిశీలించి క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు.