న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా బదులు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. హోదా బదులు ఆర్థిక సాయం చేయాలని ఎవరు అన్నా తాను సమర్థిస్తానని స్పష్టం చేశారు.


పవన్‌ బీజేపీతో ఉన్నారో లేదో తనకు తెలియదని, ఏపీకి నిధులు రావాలని ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం సమర్థిస్తానని తెలిపారు. ఆ సాయం చేయాలని కేంద్రాన్ని తాము కోరుతున్నామని అన్నారు. ప్రత్యేక హోదా బదులు హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. ఏపీ ప్రజలకు అన్ని ప్రయోజనాలు కల్పించడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. హోదా సాధ్యం కాదు కాబట్టి ఆ ప్రయోజనాలన్నీ కల్పిస్తామని, రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తున్నదని, మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు.