ఆంధ్రా అభివృద్ధి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధించాయని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు.. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఒకలా అంటే, అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణతో పోలికే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం ఎంతో బాధ కలిగించింది" అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో ఉంది. అందుకు ఏపీ పౌరులు బాధ్యులు కాదు. అన్ని రాష్ట్రాలతో సరిసమాన స్థాయికి రావాలంటే.. ఏపీకీ కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 


ఆంధ్రా పాలకులు తెలంగాణ అభివృద్ధిని తొక్కిపెట్టారని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రాగా.. "1995కి ముందు 1995కి తర్వాతి పరిస్థితిని పరిశీలిస్తే, ఎవరెవరు ఏం చేశారో తెలిసిపోతుంది కదా! అంతకు మించి ఇంకా ఎక్కువ ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నారు.