AP Assembly Election 2024: ఏపీలో ఎన్నికలకు ముందే రాజకీయం మరింత హీటెక్కుతోంది. అభ్యర్థుల మార్పు అధికార వైసీపీలో చిచ్చు రేపుతోంది. టికెట్ దక్కని నేతలు వరుసగా రాజీనామాల బాట పడుతున్నారు. తాజాగా ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో బీసీకి సీటు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించుకోవడంతో గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే పార్టీలో అనిశ్చితికి తాను కారణం కాదని స్పష్టం చేశారు.