Road Accident in Kadapa: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. వైఎస్సార్ కడప‌ జిల్లా చిత్రావతి బ్రిడ్జి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. తుఫాన్ వెహికలు లారీ ఢీకొట్టగా.. ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన బంధువులుగా తెలుస్తోంది. తుఫాన్‌ వాహనంలో 14 మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లగా.. దర్శనం అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 


కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో చిత్రావతి బ్రిడ్జి వద్ద తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్నలారీ అదుపుతప్పి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని 108కు సమాచారం అందించి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.