Vijay Meets School Students: ఓటుకు నోటుపై తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రోజుల్లో వ్యవస్థ మొత్తం కమర్షియల్‌గా మారిందన్నారు. ఎన్నికలకు ముందు డబ్బులు పంచిన వాళ్లకే కొంతమంది ఓట్లు వేస్తున్నారని అన్నారు. ఓటర్లకు డబ్బులు ఇచ్చి కొంటున్నాడంటే.. ఆ వ్యక్తి అక్రమంగా ఎంత వెనకేసుకుంటున్నాడో అర్థం చేసుకుకోవచ్చని అభిప్రాయపడ్డారు. విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేసే కార్యక్రమం నిర్వహించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్.. విద్యార్థులకు ఓటు ప్రాధాన్యతను వివరించారు. ఓటుకు నోటుపై తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించాలని విద్యార్థులకు సూచించారు. చెన్నైలోని నీలంగరైలోని ఓ ప్రైవేట్ మాన్‌పదమ్‌లో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో సహా బహుమతులు అందజేశారు. 12వ తరగతిలో 600కి 600 మార్కులు సాధించిన దిండిగల్ విద్యార్థిని నందినికి విజయ్ డైమండ్ నెక్లెస్‌ను బహూకరించారు. 


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఇక నుంచి డబ్బులు తీసుకుని ఓటు వేయవద్దని చెప్పాలని విద్యార్థులకు విజయ్ సూచించారు. విద్యార్థులు మీరు ప్రయత్నించండి.. మీరు చెబితే అది జరుగుతుందని తనకు నమ్మకం ఉందని అన్నారు. రాబోయే కొన్నేళ్లలో ఓటర్లు మీరే ఓటర్లు అని.. భవిష్యత్‌ నాయకులను ఎన్నుకోవాల్సిందే మీరేనంటూ మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోవద్దని.. అందులో మంచి విషయాల గురించి మాత్రమే తెలుసుకోవాలన్నారు. డా.బీఆర్ అంబేద్కర్‌, పెరియార్‌, కామరాజ్ వంటి గొప్ప వ్యక్తులు రాసిన పుస్తకాలను చదవాలని చెప్పారు.‌


విజయ్ కామెంట్స్‌తో పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? అనే చర్చ మొదలైంది. గతంలో తన మక్కల్ ఇయక్కం సంస్థ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. కేంద్రంపై విజయ్ బహిరంగంగా నిరసన వ్యక్తం చేసి అప్పట్లో సంచలనం క్రియేట్ చేశారు. తాజా వ్యాఖ్యలతో 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలో విజయ్ ఉంటాడనే ప్రచారం మొదలైంది.