పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ అజ్ఞాతవాసి సినిమాను అందరికన్నా ముందుగానే అర్ధరాత్రి ప్రీమియర్ షోల రూపంలో ఎంజాయ్ చేద్దాం అనుకున్న అభిమానులకి తెలంగాణ పోలీసుల నుంచి నిరాశే ఎదురైంది. ఈ నెల 10వ తేదీన అజ్ఞాతవాసి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అర్ధరాత్రి వేళ ఆ సినిమా ఎక్స్‌క్లూజీవ్ ప్రీమియర్స్‌ని ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పలు థియేటర్ల యజమానులు చేసిన విజ్ఞప్తికి తెలంగాణ పోలీసుల నుంచి నో అనే సమాధానమే బదులుగా వచ్చినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ప్రీమియర్ షోలు నిర్వహిస్తే, థియేటర్లకు భారీగా తరలివచ్చే అభిమానుల కారణంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం వున్నందునే తాము అర్ధరాత్రి షోలకు అనుమతి నిరాకరిస్తున్నాం అని తెలంగాణ పోలీసులు స్పష్టంచేశారు. అంతేకాకుండా అర్థరాత్రి వేళ థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు సైతం కల్పించలేం అని పోలీసులు తమ ప్రతిస్పందనలో పేర్కొన్నారు.


త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కల్యాణ్ లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2013లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు వీళ్లిద్దరూ కలిసి పనిచేసిన మొదటి సినిమా ఇదే. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.