తెలుగు సినిమా లెజెండ్స్‌లో అక్కినేని నాగేశ్వర రావు ఒకరని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏఎన్నార్ మృతి అనంతరం ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ వస్తే బాగుంటుందని అక్కినేని అభిమానుల కోరుకుంటున్నారు. ఎప్పుడైతే ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదలైందో... అప్పటి నుంచే అక్కినేని నాగార్జున ఎక్కడికి వెళ్లినా.. అక్కడ మీడియా అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నల్లో ఏఎన్ఆర్ బయోపిక్ ఎప్పుడు అనే ప్రశ్న కూడా ఒకటైపోయింది. అయితే, ఎప్పటికప్పుడు ఏఎన్ఆర్ బయోపిక్ కు సంబంధించిన ప్రశ్నలను సున్నితంగానే తిరస్కరిస్తూ వస్తున్న నాగ్.. ''నాన్న గారి సినిమాలను రీమేక్ చేయాలంటేనే మేము వాటికి ఆయనలా సరైన న్యాయం చేయగలమా అని భయపడిపోతున్నాం.. అలాంటిది ఏకంగా ఆయన జీవితంపైనే బయోపిక్ తెరకెక్కించడం అంటే అది కుదిరే పని కాదు'' అని చెబుతూ వస్తున్నారు. 


తాజాగా అఖిల్ అక్కినేని నటించిన మజ్ఞు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగ్.. మరోసారి ఏఎన్ఆర్ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చారు. ''నాన్న గారి సినిమాలు రీమేక్ చేయాలంటేనే ఆలోచించే తాము.. ఆయన బయోపిక్ తెరకెక్కించాలనే సాహసం కూడా చేయం'' అని తెలిపారు. ''తనకు కానీ తన కుటుంబసభ్యులకు కానీ ఏఎన్ఆర్ బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచనే లేదు'' అని నాగ్ చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు.