నేను క్షేమంగానే ఉన్నా.. కంగారు పడకండి : పోసాని కృష్ణమురళి
సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందించిన పోసాని కృష్ణమురళి
అనారోగ్య సమస్యలతో ఇటీవలే ఆస్పత్రిలో చేరి తిరిగి డిశ్చార్జ్ అయిన ప్రముఖ రచయిత, సినీనటుడు పోసాని కృష్ణ మురళి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పోసాని ఆరోగ్యం మరింత క్షీణించిందని, పరిస్థితి విషమించిందని సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందించిన పోసాని.. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని అన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మాట వాస్తవమే అయినా.. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాకా మరోసారి అస్వస్థతకు గురైనట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్న తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. మరో వారం, పది రోజులలో తిరిగి షూటింగ్ పాల్గొంటానని పోసాని వెల్లడించారు.
ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి కంగారు పడిన వారికి, తాను బాగుండాలని ప్రార్థించిన వారికి పోసాని కృతజ్ఞతలు తెలియజేశారు.