సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ( Supreme court judge N V Ramana ) పై ఆరోపణలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటీషన్ ఇప్పుడు సంచలనం కల్గిస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులు ఓ పిటీషన్ దాఖలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. సుప్రీంకోర్టు కాబోయే జడ్జిగా భావిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ..సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డెేకు ( Supreme court chief justice S A Bobde ) లేఖ రాయడమే దీనికి కారణం. ఏపీ హైకోర్టును జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని...ప్రభుత్వాన్ని నిర్వీర్యపరిచే కుట్ర జరుగుతుందని చెప్పడమే ఈ లేఖ సారాంశం. ఈ లేఖపై కొంత సానుకూలత, మరికొంత వ్యతిరేకత వ్యక్తమైంది.


ఇప్పుడు ఇదే లేఖపై మరో వివాదం రాజుకునేలా కన్పిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ( Supreme court ) లో ఇద్దరు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ లు పిటీషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ పై 30 వరకూ క్రిమినల్ కేసులు దాఖలై ఉన్నాయని..అటువంటి వ్యక్తి కాబోయే ఛీఫ్ జస్టిస్ రమణపై తీవ్రమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమని పిటీషనర్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.


న్యాయవ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నించారని..గతంలో ఛీప్ జస్టిస్ స్థాయి వ్యక్తులపై ఆరోపణలొచ్చినా..ఈ ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవని పిటీషనర్లు చెప్పారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి జగన్ తన కార్యాలయాన్ని ఉపయోగించుకున్నందున ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనేది పిటీషనర్ల వాదన. ఈ పిటీషన్ మరో రెండు మూడ్రోజుల తరువాత గానీ..దసరా సెలవుల అనంతరం గానీ విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖపై ఇప్పటికే ఢిల్లీ  హైకోర్టు బార్ అసోసియేషన్ ( Delhi High court Bar Association ) తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేసింది. మరి కొంతమంది న్యాయవిశ్లేషకులు జగన్ చర్యను సమర్ధించారు కూడా. Also read: Rajinikanth: రజినీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన మద్రాస్ హైకోర్టు