ఢిల్లీ: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తుండగా తాజా నియామకాల్లో ఆమెను ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్‌గా బదిలీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కేశరి నాథ్ త్రిపాఠి ఉండగా తాజాగా ఆయన స్థానంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది జగదీప్ ధంఖర్‌ని గవర్నర్‌గా నియమించారు.


త్రిపుర గవర్నర్‌గా వున్న కప్తాన్ సింగ్ సోలంకి స్థానంలో బీజేపి నేత రమేష్ బయాస్‌ని నియమిస్తున్నట్టు కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది. బీజేపి ఎమ్మెల్యే ఫగు చౌహన్‌ని బీహార్ గవర్నర్‌గా, ఆర్ఎన్ రవిని నాగాలాండ్ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు నాగాలాండ్ గవర్నర్‌గా పద్మనాభ ఆచార్య బాధ్యతలు నిర్వర్తించగా తాజాగా ఆయన స్థానంలో ఆర్ఎన్ రవికి ఆ బాధ్యతలు అప్పగించారు.