రైల్లో టీ అమ్మే ఓ వ్యక్తి.. ఛాయ్ తయారీలో రైలు టాయిలెట్‌ నీళ్లను వాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘట్టాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో.. జన్మలో రైల్లో టీ తాగమని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఉదంతం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. ఇద్దరు టీ అమ్మే వ్యక్తులు టీ క్యాన్‌లను తీసుకొని రైలులో ఓ బోగీలోకి ఎక్కారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అందులోని ఓ వ్యక్తి క్యాన్‌లను టాయిలెట్‌లోకి తీసుకెళ్లాడు. రెండో వ్యక్తి బయట కాపలాగా నిలుచున్నాడు. టీ క్యాన్‌లలో నీళ్లు నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనను బోగీ తలుపు వద్ద ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌తో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజులు ఈ వీడియో వైరల్‌గా మారడంతో దక్షిణ మధ్య రైల్వేపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఈ వీడియోపై రైల్వే శాఖ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంది.


దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్‌ అధికారులు వీడియోలోని టీ అమ్మే వ్యక్తులను గుర్తించారు. సికింద్రాబాద్-ఖాజీపేట జంక్షన్ల మధ్య రైళ్లలో ఆహార విక్రయ కాంట్రాక్టును సొంతం చేసుకున్న ఓ కాంట్రాక్టర్‌కి చెందిన సిబ్బందే ఈ పనికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఎస్సీఆర్ అధికారులు లక్ష రూపాయల జరినామా విధించి, ఐఆర్‌సీటీసీ లైసెన్స్‌‌ను రద్దు చేశారు.