భారత్‌లోకి పాక్ కు చెందిన ముష్కరులు ప్రవేశించారంటూ ఇంటెలిజెన్సీ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది.  ఈ నెల ప్రారంభంలో ఐఎస్ఐ ఏజెంట్ సహా నలుగురు ముష్కరులు అఫ్గానిస్థాన్ పాస్ పోర్టులతో దేశంలోకి చొరబడినట్లు హోంశాఖకు సమాచారమిచ్చింది. వారు దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్షణమైనా దాడులకు తెగబడవచ్చని హెచ్చరించింది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపిన ఐబీ... అదే సమయంలో అన్ని రాష్ట్రాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించింది.


ఐబీ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. హోంశాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దేశవ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కు విభజన, ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై వంటి మోడీ సర్కార్ చర్యలతో రగిలిపోతున్న పాక్ ...భారత దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.